Monday, May 30, 2011

capetal


కో అంటే...కోటి

న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీలు కదం తొక్కుతుండటంతో వేతన మార్కెట్‌లో కోటి రూకల వాన కురుస్తోంది. ఇప్పటివరకూ ముకేష్ అంబానీతో సహా మొత్తం 30 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల జీతగాళ్లుగా ఖ్యాతి గడించారు. టాప్ బాసులకు చెల్లించిన జీతాల వివరాలను 32 కంపెనీలు ప్రకటిస్తే.. ఇందులో 12 కంపెనీల నుంచి 30 మంది కోటి రూపాయలకు పైగా వేతన ప్యాకేజీలతో సంచలనం సృష్టించారు. గత ఏడాది 459 కంపెనీలు కోటి రూపాయలకు మించిన జీతాన్ని తమ ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించినట్లు ప్రకటించాయి. మొత్తం 800 ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల క్లబ్బులో స్థానం సంపాదించారు. ఈసారి సంఖ్య మరింత పెరగవచ్చని ప్రముఖ ఆర్థిక గణాంక సంస్థ క్యాపిటల్ లైన్ అంటోంది. ఇప్పటివరకూ వేతన ప్యాకేజీల వివరాలను ప్రకటించిన కంపెనీలు గతంతో పోల్చితే చాలా తక్కువ. త్వరలోనే మిగతా కంపెనీల వివరాలూ అందుతాయని, ఈసారి కోట్లకు పడగలెత్తిన ఉద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.

ఇప్పటివరకూ అంబానీయే టాప్..
అందుబాటులోకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం కోటి రూపాయల వేతన క్లబ్బులో ముకేష్ అంబానీయే ప్రథమ స్థానంలో నిలిచారు. అంబానీ వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలు. గత ఏడాది అత్యధికంగా 37.08 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో సన్ టివి అధినేత కళానిధి మారన్ గరిష్ట వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా సంచలనం సృష్టించారు. నిజానికి అంబానీ 2007-08లోనే 44 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో తన జీతాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇటీవలే పదిహేను కోట్ల రూపాయలకు మించి వేతనాన్ని తీసుకోరాదని నిర్ణయించారు. అందుకే 2009-10 టాప్ టెన్ హయ్యెస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో అంబానీ లేకపోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ మారింది. ఎంత జీతం తీసుకుంటే అంత గొప్ప అన్న ధోరణి ప్రబలడంతో ఈ ఏడాది కార్పొరేట్ కోటి రూపాయల జీతగాళ్ల సంఖ్య వెయ్యికి పైగా ఉంటారని క్యాపిటల్ లైన్ అంటోంది.

కోటి రూకల జీతగాళ్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీతో పాటు మరో నలుగురిని కోటి రూపాయల వేతనంతో సత్కరించింది. నిఖిల్ మేస్వానీ, హితేల్ మేస్వానీ, పిఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్‌ల వార్షిక వేతనం ఈ మార్కును అధిగమించింది. ఐసిఐసిఐలో చందా కొచ్చార్‌తో సహా కె రామ్‌కుమార్, ఎన్ఎస్ కన్నన్, రాజీవ్ సబర్వాల్‌లు ఈ క్లబ్బులో స్థానం సంపాదించారు. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే, ఎస్. గోపాలకృష్ణన్, ఎస్‌డి శిబులాల్, టివి మోహన్‌దాస్ పాయ్, కె దినేష్‌లు కోటి రూపాయలకు పైగా వేతనం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ ఎన్‌కె జైన్, లలిత్ కుమార్ గుప్తా, ఎస్ఎస్ రావులు సైతం ఈ హోదా సాధించారు. హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ అజిత్ గులాబ్‌చంద్, రేమండ్స్ గౌతం హరి సింఘానియా తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 32 కంపెనీల్లో 12 కంపెనీలు కోటి రూపాయల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు వందలకు పైగా కంపెనీల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టాప్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో ప్రథమ స్థానాన్ని మారన్ చేజిక్కించుకుంటారో లేక మరొకరు అందుకుంటారో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment