అమెరికాలో తలసరి పెట్రోలు వాడకం ఇండియాలో కంటే 26 రెట్లు ఎక్కువ. అందువల్ల పెట్రోలుకు సంబంధించిన ఏ అంశమైనా అమెరికన్ పౌరులను అమితంగా ఆకర్షిస్తుంది. ఈ పెట్రోలు నిల్వల కోసమే అమెరికా మొత్తం పర్షియన్ గల్ఫ్ను తన గుప్పిట్లో పెట్టుకున్నా, ఇరాక్పై దాడిచేసినా, కువైట్ను అతలాకుతలం చేసినా అమెరికన్ పౌరులు పెద్దగా పట్టించుకోరు. అమెరికా పౌరులు తమ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఎప్పుడూ అమెరికా ప్రభుత్వం సలహా చెప్పదు. అటువంటి సలహాలను అమెరికన్ పౌరులు హర్షించరు. అందువల్ల నిరంతరం పెట్రోలు దాహంతో బ్రహ్మరాక్షసిలా అమెరికా ఈ నిల్వలు ఉన్న ప్రాంతాలను తన గుప్పిట్లో పెట్టుకుంటున్నది. ఇటీవలి కాలంలో ప్రపంచ జనాభాలో ఐదువంతుల్లో రెండు వంతులు ఉన్న ఇండియా, చైనాలు దాదాపు పది శాతం వృద్ధి సాధించడం వల్ల చమురు వాడకం విపరీతంగా పెరుగుతున్నది. ఇంధన భద్రత కోసం ఈ రెండు దేశాలు ప్రపంచాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ పరుగు పందెంలో చైనా చాలా ముందుంది. ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలతో స్నేహం చేస్తూ వాటికి చౌకగా ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు సరఫరా చేస్తూ అక్కడి క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. ఇండియా చైనా అంత వేగంగా అడుగులు వేయలేకపోయినా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నది. ప్రతిక్షణం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా, ఇండియాల నామజపం చేయడానికి ఇదే కారణం. ఈ దశలో అమెరికా తన చమురు లభ్యత తగ్గుతుందేమోనన్న భయంతో విశృంఖలంగా గల్ఫ్ దేశాలపై దుందుడుకు వైఖరి అవలంభించడానికి ఏ మాత్రం వెనుకాడకపోవచ్చు. ఇప్పటికే అమెరికా పౌరులు ప్రతి సంవత్సరం తలసరి ఉపయోగించే 69 బేరళ్ల చమురు నిల్వలు సంపాదించడానికి అమెరికా తన విదేశాంగ విధానానికి తోడుగా సైనిక సంపత్తిని వినియోగించడానికి వెనుకాడదు. భారతీయులు తలసరి రెండు బేరల్స్ చమురు వినియోగిస్తే చైనీయులు నాలుగు బేరల్స్, బ్రిటిషర్లు 32 బేరల్స్ చమురు వినియోగి స్తున్నారు. అమెరికా వ్యతిరేక వైఖరి అనుసరించిన బిన్లాదెన్ను హతం చేసినట్లే అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే వారిని ఎవరినైనా హతం చేస్తానన్న సందేశం ఈ దాడిలో ఉంది.
No comments:
Post a Comment